Wednesday 4 January 2017

Swayambhu Komuravelli Mallanna

Image may contain: 2 people
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో వెలసిన కొమురవెల్లి మల్లికార్జునుడు కొమురెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర అటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల ప్రజలకూ కొంగుబంగారమై అలరారుతున్నాడు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మొదటి ఆదివారం నాడు మొదలుకొని చివరి ఆదివారం వరకు జాతరలు జరుగుతాయి. ఈ జాతరలు దక్షిణభారతంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి అని చెప్పవచ్చు. చివరి ఆదివారం (డిశంబర్‌ 25) మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గల నాలుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
600 సంవత్సరాల నాటిది
కొమురవెల్లిలోని మల్లన్న ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నాటిదని స్థానికులు చెబుతారు. పాతికేళ్ల క్రితం ఈ ఆలయ సమీపంలో మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌ కాలంలోని నాణేలు దొరికాయి. దీన్ని బట్టి హుమయూన్‌ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధమైనదన్న విషయం తెలుస్తోంది. కొమురవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రానూ ‘కొమురవెల్లి’గా మారిందని అంటారు.
స్వయంభువు
ఇక్కడ మల్లికార్జున స్వామి స్వయంభువు అని అంటారు. అంటే స్వయంగా వెలిశాడని అర్థం. ఈ ఆలయాన్ని ఏ రాజులూ నిర్మించలేదనీ, అక్కడ ధ్వజస్తంభం, రాజ శాసనాలూ లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనటానికి నిదర్శనాలనీ పూజారులు చెబుతారు. శివుడికి గంగా, పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు. ‘ఖండోబా’ ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో, ఆ పూజారి ఇక్కడికి వచ్చాడనీ, అక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయడం మొదలు పెట్టాడనీ ఒక కథ ప్రచారంలో ఉంది. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర ముగ్గురు రాక్షసుల తలలుంటాయి.
శివ కళ్యాణం
దాదాపు మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని ‘పట్టణం వారం’ (హైదరాబాద్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని) గా పిలుస్తారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటిరోజు ‘పట్నం’ వైభవంగా నిర్వహిస్తారు. రెండో ఆదివారం ‘లష్కర్‌ వారం’ గా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్‌ లష్కర్‌ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చి స్వామికి బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం జరిగే కళ్యాణం ఓ ప్రత్యేక ఘట్టం. ఆ రోజు జరిగే శివకల్యాణం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ చివరి వారం నాడు భక్తులు ఇసుకు వేస్తే రాలనంత సంఖ్యలో వస్తారు.
పట్నం అంటే..
ముగ్గూ మరియు ఇతర ఐదు రకాల ప్రకతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికనే ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గుపోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. దీనినే స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడూ శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గూ అందులో స్వామివారి ఉత్సవ మూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్దపట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులూ శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది.
రెండు వంశాల అర్చకులు
ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరిపించే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారున్నారు. మహదేవుని వంశంవారు అమ్మవార్ల తరఫున కన్యాదానం చేయగా, పడిగన్న వంశంవారు స్వామి తరఫు వారిగా ఉండి కల్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు. చివరి రోజు అగ్ని గుండం తొక్కడంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచీ దాదాపు 300 మంది శివసత్తులు జాతర సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవస్థానం తరఫున వీరికి చెల్ల, గంట, చీర, త్రిశూలం ఇచ్చి సన్మానించడం ఆనవాయితీ.
ఇక్కడి ఒళ్లు బండమీద చేతులు ఆన్చి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. చుక్కలాది పర్వతం సూర్మాను గుండుగా పిలిచే రెండు పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయానికి సమీపంలో ఆంజనేయ, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ దేవాలయా లున్నాయి. ఇవీ ఈ ఆలయంలో చెప్పుకోదగిన ప్రత్యేకతలు.
స్వయంగా వెలసిన ఈ మల్లికార్జున స్వామిని దర్శించండి, తరించండి....
(Courtesy: Jagriti Weekly)

No comments:

Post a Comment