Wednesday 12 April 2017

About Hanuman Jayanthi...


శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ?

 మంగళవారం, చైత్ర పౌర్ణిమ, శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)

''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.

హిందూమతంలో ప్రాముఖ్యత :

హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః

రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః

లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః

తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్


హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.

హనుమంతుని నైజం

యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్

బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.






భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. .(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.

Sunday 9 April 2017

Shiva-Tatvam కంచి మఠం

శివతత్వం

శివశంకరన్ కంచి మఠానికి
చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది.

ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు

మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు.

”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అసంపూర్ణంగా చేస్తారు. కాని వాళ్ళను ఇంటికి పంపించలేము.

మొత్తంగా ప్రభుత్వం పనిచేస్తోంది కదా అది ముఖ్యం. ఇది సరిగ్గా పనిచేస్తుంటే చాలు. ఇది మాత్రమే సాధ్యపడుతుంది. శ్రీమఠం ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిది. చాలా రకములైన పరిచారకులు ఉంటారు ఇక్కడ. నీకు పరమేశ్వరుడు తెలుసా?” అని అడిగారు.

శివశంకరన్ కు శ్రీమఠంలో ఆ పెరుగలవారు ఐదారుగురు తెలుసు. ఎవరి గురించి మహాస్వామి వారు అడుగుతున్నారో అతనికి అర్థం కాలేదు.

అతని అవస్థ చూసి స్వామివారు ”నేను చెప్తున్నది కైలాసవాసి అయిన పరమేశ్వరుని గురించి. అతని కంఠంలో పాము ఉంటుంది. ఒక చేతిలో అగ్ని ఉంటుంది. కాళ్ళకింద దురాశకు ప్రతిరూపమైన ఒక దేవతని తన ఆధీనంలో తొక్కి ఉంచుతాడు. భూతములు, దెయ్యాలు అతని గణాలు. వీటన్నిటిని వెంటబెట్టుకుని నృత్యం చేస్తుంటాడు విశ్వమంతా తిరుగుతూ.

పామును కనక వదిలేస్తే అది స్వేచ్ఛగా తిరిగి అందరిని భయపెట్టి కాటేస్తుంది. అగ్నిని నియంత్రించక పోతే, అది స్థావర జంగమాలను దహించివేస్తుంది. భూతపిశాచ గణములను వదిలేస్తే ఎవర్ని పడీతే వారిపై దాడి చేస్తాయి. అవి చేసే ఘోరాలను చెప్పవలసిన పని లేదు. ఇటువంటి చెడ్డ శక్తులను తన వద్ద ఉంచుకోవడమే పరమేశ్వరుని గొప్పతనం” అని చెప్పారు.

శివశంకరన్ ఇదంతా విని నిర్ఘాంతపోయి మౌనంగా నిలుచున్నాడు. మహాస్వామి వారు అతణ్ణి మృదువచనాలతో సంతృప్తి పరుస్తారు అనుకున్నాడు. కాని స్వామి వారి మాటలు ప్రపంచ రీతులని బట్టబయలు చేసారు.

ఇది శివశంకరన్ కు మాత్రమే కాదు. భక్తులందరికి శుద్దమైన ఆలోచనలు కలిగిస్తుంది. ఉన్నత స్థితిని కలిగిస్తుంది.

!! యద్భావం తద్భవతి !!

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం